‘పుష్ప’ ప్లాన్స్ మార్చే పనే లేదంటున్న సుకుమార్

‘పుష్ప’ ప్లాన్స్ మార్చే పనే లేదంటున్న సుకుమార్

Published on Sep 25, 2020 3:00 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తర్వాతి చిత్రం ‘పుష్ప’. సుకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన చిత్రీకరణను త్వరలో రీస్టార్ట్ చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ఇప్పటివరకు జరిగిన చిత్రీకరణ కేరళ అడవుల్లో జరిగింది. సుకుమార్ వేసుకున్న ముందస్తు ప్రణాళిక ప్రకారం ఇంకా చాలా భాగం చిత్రీకరణ కేరళ అడవుల్లోనే జరగాల్సి ఉంది. కానీ కోవిడ్ నిబంధనల కారణంగా ఆ చిత్రీకరణను వికారాబాద్ ఆటవీ ప్రాంతంలో, రంపచోడవరం అడవుల్లో తెరకెక్కించాలని సుకుమార్ భావిస్తున్నట్టు వార్తలొచ్చాయి.

కానీ సుకుమార్ మనసులో అలాంటి ఆలోచన ఏదీ లేదని తెలుస్తోంది. సినిమా నేపథ్యానికి కేరళ అడవులు అయితేనే అన్ని విధాలా అనుకూలంగా ఉంటాయని, ఇప్పటికే లోకేషన్స్ ఫైనల్ చేయడం జరిగిందని, అక్కడే షూటింగ్ చేస్తారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. సో.. ‘పుష్ప’ పాత ప్లాన్స్ ఏవీ మార్చే పనే లేదని స్పష్టమైపోయింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో నడిచే ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటించనుంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో బన్నీ పక్కా మాస్ లుక్ తో కనిపించనున్నారు. బన్నీ గత చిత్రం ‘అల వైకుంఠపురములో’ మంచి విజయం సాధించిన నేపథ్యంలో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు