ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ ‘పుష్ప-2’ కోసం అభిమానులు ఏ రేంజ్ లో వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ ను బన్నీ షేక్ చేస్తాడని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ చిత్ర పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ‘సూసేకి’ అనే రెండో సాంగ్ ను రిలీజ్ చేయగా, ప్రస్తుతం అది నెట్టింట దుమ్ములేపుతోంది.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటను శ్రేయా ఘోషల్ పాడారు. ఈ పాటకు యూత్ స్టెప్పులు వేస్తూ, సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఇక ఈ పాటపై ప్రేక్షకులతో పాటు పలువురు సెలబ్రిటీలు సైతం కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా తమిళ వర్సెటైల్ యాక్టర్ కమ్ డైరెక్టర్ సెల్వ రాఘవన్ ‘సూసేకి’ పాటపై ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. పుష్ప-2 సినిమా సత్తా ఏమిటో తెలియాలంటే ఈ ఒక్క పాట చాలని.. మిగతాదంతా బోనస్ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
దీనికి అల్లు అర్జున్ రిప్లై కూడా ఇచ్చారు. ”థ్యాంక్ యు సెల్వ గారు.. సో స్వీట్ ఆఫ్ యు” అంటూ బన్నీ రిప్లై ఇచ్చారు. దీంతో పుష్ప-2 క్రేజ్ కామన్ ఆడియెన్స్ తో పాటు సెలబ్రిటీలలో కూడా నెక్ట్స్ లెవెల్ లో ఉందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇక పుష్ప-2 మూవీలో రష్మిక మందన్న, ఫహాద్ ఫసిల్, అనసూయ, సునీల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 15న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మైత్రీ మూవీ మేకర్స్ రెడీ అవుతున్నారు.