సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తో అశోక్ గల్లా లేటెస్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్..

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి మంచి పాపులర్ నిర్మాణ సంస్థల్లో ఒక వైపు అగ్ర కథానాయకులతో భారీ చిత్రాలు చేస్తూనే, మరోవైపు యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ వైవిధ్యమైన చిత్రాలను నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కూడా ఒకటి. మరి లేటెస్ట్ గా వీరి నుంచి మరో కొత్త చిత్రం ప్రారంభం అయ్యింది. తన మొదటి సినిమా తోనే మెప్పించిన యువ నటుడు అశోక్ గల్లా కథానాయకుడిగా ప్రొడక్షన్ నెం.27 చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.

నేడు సినీ ప్రముఖల సమక్షంలో చిత్ర ప్రారంభోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. నమ్రత ఘట్టమనేని ఫస్ట్ క్లాప్ ఇవ్వగా, పద్మ గల్లా మరియు మంజుల స్వరూప్ తమ చేతుల మీదుగా స్క్రిప్ట్‌ని చిత్ర బృందానికి అందజేశారు. చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటూ చిత్ర బృందానికి అతిథులు శుభాకాంక్షలు తెలిపారు.

మంచి రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో అశోక్ గల్లాతో పాటు ‘మ్యాడ్’ ఫేమ్ శ్రీ గౌరీ ప్రియ, ‘కోట బొమ్మాళి పి.ఎస్’ ఫేమ్ రాహుల్ విజయ్, శివాత్మిక ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అమెరికా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి యువ దర్శకుడు ఉద్భవ్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. సెప్టెంబర్ నెలాఖరు నుంచి చిత్ర బృందం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనుంది.

Exit mobile version