రేవంత్ రెడ్డిని కలిసిన సూపర్ స్టార్

తెలంగాణలో ఇటీవల వచ్చిన భారీ వర్షాలు, వరదల వల్ల పలు ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి. విపత్తు నుంచి బయటపడేందుకు సాయం అందించడానికి పలువురు ప్రముఖులు, టాలీవుడ్ హీరోలు ముందుకొచ్చారు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు తన సతీమణి నమ్రత శిరోద్కర్ తో కలిసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 లక్షల విరాళం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సీఎంతో కలిసి ఫోటోలు కూడా దిగారు.

మహేష్ చేసిన విరాళం గురించి సీఎం స్పందిస్తూ.. ‘ఈ రోజు ప్రముఖ సినీ నటుడు శ్రీ జి.మహేష్ బాబు దంపతులు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 లక్షలు విరాళం అందజేశారు. AMB తరపున మరో రూ.10 లక్షల విరాళం అందజేశారు. వారికి నా అభినందనలు’ అని తెలిపారు. అన్నట్టు మహేష్ బాబు అటు ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయనిధికి కూడా రూ.50 లక్షల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు చేసిన ఈ సహాయం పునరావాస కార్యక్రమాలకు ఎంతో ఉపయోగపడుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Exit mobile version