పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ పూర్తి సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కిస్తుండటంతో ఆడియెన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ అంచనాలను రెట్టింపు చేసింది.
అయితే, ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ పై ఓ ఇంట్రెస్టింగ్ వార్త వినిపిస్తోంది. ‘కల్కి’ మూవీకి సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను అత్యంత భారీ స్థాయిలో నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఏపీలోని అమరావతిలో ఈ ఈవెంట్ ను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారట. అంతేగాక, ఈ ఈవెంట్ కు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లతో పాటు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిలను తీసుకొచ్చేంందుకు కల్కి టీమ్ ప్లాన్ చేస్తోందట.
ఒకవేళ నిజంగానే ఇంతమంది ప్రముఖులు ఒకే వేదికపై కనిపిస్తే వారి అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోతాయి. కాగా ‘కల్కి’ మూవీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొనె, దిశా పటాని తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.