కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా కరోనా పై పోరాటంలో భాగంగా తీసుకుంటున్న చర్యలకు తమ వంతు సాయం అందించడానికి పలువురు రాజకీయ మరియు సినీ ప్రముఖలు ముందుకొస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సంక్షోభ సమయంలో సీనియర్ నటుడు నరేష్ ‘మా’ లోని 100 మంది సభ్యులకు 10,000 చొప్పున 10 లక్షల రూపాయిలను సాయంగా అందిస్తున్నారు. ఇప్పటికే 58 మంది సభ్యుల బ్యాంకు ఖాతాలకు డబ్బులను జమ చేశారు. మిగిలిన సభ్యులకు కూడా ఇస్తున్నారు. అలాగే కరోనా క్రైసిస్ చారిటీ మనకోసం (సీసీసీ)కు మరో లక్ష రూపాయిలను విరాళంగా ప్రకటించారు.
కాగా కరోనా వ్యాప్తి నిరోధం విషయంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అహర్నిశలూ కృషి చేస్తున్నాయి. ప్రభుత్వాల సలహాలు, సూచనలు ప్రజలందరూ తూ.చ. తప్పకుండా పాటించాలని నరేష్ కోరుతున్నారు. ఈ విపత్కర పరిస్థితిని సమష్టిగా ఎదుర్కోవాలని అందరూ ఇళ్లల్లోనే సురక్షితంగా ఉండాలని నరేష్ తెలిపారు.