మా నాన్నగారి శతజయంతి ఉత్సవాలను నాట్స్ నిర్వహించటం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది – అల్లు అరవింద్

మా నాన్నగారి శతజయంతి ఉత్సవాలను నాట్స్ నిర్వహించటం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది – అల్లు అరవింద్

Published on Mar 29, 2023 9:41 AM IST

సరిగ్గా వందేళ్ల క్రితం తెలుగు వారందరూ సగర్వంగా ఇతను మావాడు అని చెప్పుకునే ముగ్గురు తెలుగు సినిమా మహనీయులు జన్మించారు. ప్రముఖ గాయకుడు ఘంటసాల, నవ్వుల రాజు అల్లు రామలింగయ్య, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావుల శతజయంతి ఉత్సవాలను మే 26, 27, 28 తేదిల్లో న్యూజెర్సీలో ఎంతో ఘనంగా చేయటానికి రంగం సిద్ధం చేసుకుంది నాట్స్‌ ( ఉత్తర అమెరికా తెలుగు సమితి).

వారెంతో ప్రేమతో నిర్వహిస్తున్న ఈ వేడుకల గురించి సవివరంగా తెలియపర చటానికి హైదరాబాద్లోని పార్క్‌ హయాత్‌ హోటల్లో ప్రెస్‌మీట్‌ పెట్టి మీడియాతో ముచ్చటించారు నాట్స్‌ ప్రెసిడెంట్‌ బాపు నూతి, కన్వీనర్‌ శ్రీధర్‌ అప్పసాని, డిప్యూడి కన్వీనర్‌ రాజ్‌ అల్లాడలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, సహజనటి జయసుధ, ఆస్కార్‌ అవార్డు గ్రహీత చంద్రబోస్, నటులు సాయికుమార్, అలీ, ఆది సాయికుమార్‌లతో పాటు అవసరాల శ్రీనివాస్‌ దర్శకులు ఎ.కోదండరామి రెడ్డి, బి.గోపాల్, గోపిచంద్‌ మలినేని, సిరాశ్రీ, గాయకులు సింహ, దినకర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాట్స్‌ అధ్యక్షుడు బాపు నూతి మాట్లాడుతూ, “అమెరికాలో ఉండి మన తెలుగువారి బాగోగులను దగ్గరుండి చూసుకుంటుంది నాట్స్‌. తెలుగు వారికి ఏ కష్టం వచ్చినా క్షణాల్లో వారికి పరిష్కారం చూపించటమే కాకుండా అక్కడున్న తెలుగు వారికి సామాజిక, ఆర్ధిక సంక్షేమాన్ని సమకూర్చి మేమున్నామన్న ధైర్యాన్ని భరోసాని గట్టిగా ఇచ్చే సంస్థే నాట్స్‌ అని సగర్వంగా చెప్తున్నాను. అలాగే ఈ ఏడాది ఉత్తరమెరికా తెలుగు సంబురాలులో భాగంగా మన తెలుగు పెద్దల శత జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవటానికి భారీఎత్తున ప్లాన్‌ చేసుకుని ఇండియాకి వచ్చాము. ఈ ఈవెంట్‌లో పాల్గొనటానికి తెలుగు సినిమా పరిశ్రమ నుండి అతిరథ మహారధులు ఎంతో మంది అమెరికాకి వచ్చి న్యూజెర్సీలో జరిగే వేడుకల్లో పాల్గొంటున్నారని చెప్పటానికి ఎంతో ఆనందంగా ఉంది” అని అన్నారు.

నాట్స్‌ కన్వీనర్‌ శ్రీధర్‌ అప్పసాని మాట్లాడుతూ, “ఈ ఏడాది మేము చేస్తున్న ఈ సంబురాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. తెలుగు సినిమాకు ఎంతో గొప్ప సేవలందించిన ఆ ముగ్గురు మహనీయుల శతజయంతి ఉత్సవాలతోపాటు నటులుగా గోల్డెన్‌ జూబ్లి అంటే 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న జయసుధ, సాయికుమార్‌లను మా వేదికపై సత్కరించి వేడుకలను ఘనంగా చేయాలని మేమందరం నిర్ణయించుకున్నాం. గతంలో అనేక కార్యక్రమాలు చేసినప్పటికి ఈ ఏడాది చేసే కార్యక్రమాలకు ఎంతో విశిష్టత చేకూరనుంది. ఆయన అమెరికాకి వస్తాను అని మాటిచ్చిన తర్వాత గోల్డెన్‌గ్లోబ్‌ అవార్డు, ఆస్కార్‌ అవార్డు వచ్చింది. అస్కార్‌ అవార్డు గ్రహీత చంద్రబోస్‌ గారిని సత్కరించే అవకాశం నాట్స్‌కి రావటం లాటరీ టికెట్‌ కొన్నవాడికి జాక్‌పాట్‌ తగిలితే ఎంత ఆనందంగా ఉంటుందో అంతే ఆనందంగా ఉంది. మేము చేసే ప్రతి కార్యక్రమం నుంచి ఎవరో ఒకరికి మేలు జరిగే విధంగా కార్యక్రమాలను రూపొందిస్తున్నాం” అని అన్నారు.

డిప్యూటీ కన్వీనర్‌ రాజ్‌ అల్లాడ మాట్లాడుతూ, “అమెరికాలోని తెలుగు వారికే కాదు, ఇండియాలోని తెలుగు వారికి కూడా మా సంస్థ ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. మా ఫండ్స్‌ నుండి దాదాపు 25 శాతం సొమ్మును సామాజిక సేవకోసం పలు స్వచ్చంధ సంస్థలకు కేటాయిస్తున్నాం. తెలుగువారు అమెరికాలో ఉన్నా ఇండియాలో ఉన్నా వారిని ఆదుకొని సాయం చేయటమే మా సంస్థ లక్ష్యం. ఎంటర్టైన్‌మెంట్‌తో పాటు యూత్‌ని ఎంకరేజ్‌ చేయటానికి సీ.ఎక్స్‌.ఓ ఫోరంను నిర్వహించి యంగ్‌ టాలెంట్‌ను ప్రోత్సహిస్తున్నాం” అని అన్నారు.

సాయికుమార్‌ మాట్లాడుతూ, “తెలుగు భాషకి పట్టాభిషేకం చేస్తున్న నాట్స్‌ వారితో నాకు ఎంతో అనుబంధం ఉంది. నేను గతంలో అనేకసార్లు నాట్స్‌ వేడుకల్లో పాల్గొన్నాను. ఈసారి వేడుకల్లో పాల్గొనటం నాకు వ్యక్తిగతంగా చాలా ఆనందంగా ఉంది. కారణమేంటంటే ఘంటసాల గారి దగ్గరికి మా నాన్నగారు పి.జె శర్మగారు ఒకసారి తీసుకెళ్లారు. అక్కడ నేను ధుర్యోధనుడి డైలాగ్స్‌ చెప్పి ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను. అల్లు రామలింగయ్యగారితో నేను బాపుగారి దర్శకత్వంలో నటించటం జరిగింది. యన్టీఆర్‌ గారు హీరోగా నటించిన సంసారం సినిమాతో నా డబ్బింగ్‌ కెరీర్‌ ప్రారంభమైంది” అని అన్నారు.

అరవింద్‌ గారు మాట్లాడుతూ, “మా నాన్నగారు అల్లు రామలింగయ్యగారి శతజయంతి ఉత్సవాలను అమెరికాలో నిర్వహించటం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. నాతోపాటు నా స్నేహితులైన పారిశ్రామిక వేత్తలు రెయిన్‌బో హస్పిటల్స్‌ అధినేత డాక్టర్‌ రమేశ్‌ కంచర్ల, కిశోర్‌ కొత్తపల్లి కూడా ఈ సంబురాల్లో పాల్గొంటున్నారు” అని అన్నారు.

జయసుధ మాట్లాడుతూ, “మంచి కార్యక్రమాలు చేస్తున్న నార్త్‌ అమెరికా తెలుగు సొసైటీ వారి కార్యక్రమంలో నేను పాల్గొనటం ఆనందంగా ఉంది” అని అన్నారు.

అలీ మాట్లాడుతూ, “నాట్స్‌తో నాకున్న అనుబంధం ఇప్పటిది కాదు. 2009 నుండి నేను వారి కార్యక్రమాల్లో పాల్గొంటున్నా” అని అన్నారు. వీరితోపాటు అనేకమంది నటీనటులు, బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌ నాట్స్‌ 2023 సంబరాల్లో పాల్గొనటానికి ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఈ ఈవెంట్‌కి వెగాశ్రీ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్, వైకుంట్ డెవలపర్స్, వాడిలాల్, జీ అండ్‌ సి అలకనంద రివర్‌ ఫ్రంట్, డెలీకోస్, తెలుగు ఫుడ్స్, ర్యాస్‌బెర్రీస్, అవిజ్ఞా గోల్డ్‌ స్పాన్సర్స్‌గా వ్యవహరిస్తున్నారు. నటి, నిర్మాత ప్రవీణా కడియాల ఈవెంట్‌కి ఆర్గనైజర్‌గా వ్యవహరించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు