“ఏప్రిల్ 28 ఏం జరిగింది” ప్రీ రిలీజ్ వేడుకలో హీరో నిఖిల్, బిగ్‌బాస్ ఫేమ్ సయ్యద్ సోహెల్..!

“ఏప్రిల్ 28 ఏం జరిగింది” ప్రీ రిలీజ్ వేడుకలో హీరో నిఖిల్, బిగ్‌బాస్ ఫేమ్ సయ్యద్ సోహెల్..!

Published on Feb 23, 2021 6:59 PM IST


రంజిత్‌, షెర్రీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా వీరాస్వామి.జి స్వీయ దర్శకత్వంలో వీజీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రూపొందించిన చిత్రం “ఏప్రిల్ 28 ఏం జరిగింది”. ఈ నెల 27న ఈ చిత్రం విడుదలకానున్న నేపధ్యంలో నేడు హైదరాబాద్‌లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో నిఖిల్, బిగ్‌బాస్-4 ఫేమ్ సయ్యద్ సొహెల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా హీరో నిఖిల్ మాట్లాడుతూ పెద్ద సినిమా, చిన్న సినిమా అనే భేదాలకు అర్థం ఏమిటో నాకు తెలియదని, సినిమా బడ్జెట్ ఎంత, అందులో ఎవరూ నటించారనేది దానికంటే సినిమా అందించే ఎక్స్‌పీరియన్స్ ముఖ్యం అని నా భావన. అయితే ఎలాంటి అంచనాలు లేకుండా నేను ఈ సినిమా చూశా, చాలా నచ్చింది. హీరో రంజిత్ నాకు మంచి స్నేహితుడని, యువత, అంకిత్ పల్లవి అండ్ ఫ్రెండ్స్ సమయంలో ఆ సినిమాల్ని జనాల్లోకి తీసుకెళ్లడానికి నేను పడిన బాధ, తపన అవన్నీ రంజిత్‌లో ఈ సినిమా ద్వారా చూస్తున్నా. మంచి పాయింట్‌ను ఎంచుకొని ఈ సినిమా చేశారని, ఊహకందని మలుపులతో ఈ సినిమా థ్రిల్‌ను పంచుతుందని, సెకండాఫ్, పతాక ఘట్టాలు ప్రేక్షకుల్ని మెప్పిస్తాయని నిఖిల్ అన్నారు. మంచి సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం బాధ్యతగా భావించి ఈ సినిమాను ప్రోత్సహించడానికి ముందుకొచ్చా. సౌండ్ డిజైనింగ్, ఎడిటింగ్ బాగుందని, ట్రైలర్‌కు మించి సినిమా అద్భుతంగా ఉంటుంది అని అన్నారు.

బిగ్‌బాస్ ఫేమ్ సయ్యద్ సోహెల్ మాట్లాడుతూ బిగ్‌బాస్ నుంచి వచ్చిన తర్వాత నేను చూసిన మొదటి సినిమా ఇదని, నాకు ఈ సినిమా చాలా బాగా నచ్చింది. అశ్లీలత, ద్వంద్వర్థాలకు తావు లేకుండా కుటుంబమంతా కలిసిచూసేలా ఈ సినిమా ఉంటుందని, హీరో రంజిత్ అద్భుతమైన నటనను కనబరిచాడని, దర్శకుడు వీరాస్వామి చక్కని పాయింట్‌తో సినిమాను తెరకెక్కించారు. హరిప్రసాద్ స్క్రీన్‌ప్లే ఉత్కంఠను పంచుతుందని, బోర్ లేకుండా ఈ సినిమా మంచి థ్రిల్‌ను కలిగిస్తుందని అన్నారు.

హీరో రంజిత్ మాట్లాడుతూ ఏప్రిల్ 28న అడవిరాముడు, యమలీల, బాహుబలి, పోకిరి లాంటి గొప్ప సినిమాలు విడుదలయ్యాయని హాస్యనటుడు అలీ ఓ సందర్భంలో చెప్పారని, అలాంటి మంచి రోజును టైటిల్‌గా తీసుకొని రూపొందిన చిత్రమిదని, ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరం ఎంతో కష్టపడి పని చేశామని, మంచి ప్రయత్నంగా తెలుగు ప్రేక్షకుల్ని ఆదరిస్తారనే నమ్మకముందని అన్నారు.

దర్శకుడు వీరాస్వామి మాట్లాడుతూ ఈ సినిమాను ముందు మార్చి 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నామని కానీ ఆ రోజు ఎక్కువ సినిమాలు విడుదలవుతుండటంతో ఫిబ్రవరి 27న విడుదలచేస్తున్నామని అన్నారు. డ్యాన్స్ అసిస్టెంట్, డ్యాన్స్‌మాస్టర్, రచయిత, దర్శకుడిగా ఇలా నా ప్రతి అడుగులో నా కుటుంబ సభ్యుల సహకారం ఉందని, రంజిత్‌కు నాపై ఉన్న నమ్మకం వల్లే ఈ సినిమా చేయగలిగానని అన్నారు. ధర్మతేజ సాహిత్యం, సందీప్ సంగీతం, భాను నృత్యాలు, రంజిత్, రాజీవ్ కనకాల, అజయ్ అభినయం ఈ చిత్రానికి ప్రధానాకర్షణగా నిలుస్తాయని అన్నారు. నిఖిల్, సోహెల్ సినిమా చూసి ప్రశంసించడంతో పాటు ప్రేక్షకుల్లోకి ఈ చిత్రాన్ని తీసుకెళ్లడానికి సహాయం చేస్తుండటం ఆనందంగా ఉందని అన్నారు.

స్క్రీన్‌ప్లే రైటర్ హరిప్రసాద్ జక్కా మాట్లాడుతూ ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందించామని, ఓ ఇంటి నేపథ్యంలో విభిన్నంగా సాగుతుంది. డాక్టర్‌గా పేరుతెచ్చుకున్న రంజిత్ ఈ సినిమాతో యాక్టర్‌గా చక్కటి గుర్తింపును తెచ్చుకుంటాడనే నమ్మకముందని అన్నారు. ఇక గేయరచయిత ధర్మతేజ కూడా మాట్లాడుతూ సినిమా కథను అంతర్లీనంగా చాటిచెప్పే మంచి పాటను రాశాను. చక్కటి టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు.

ఇక సంగీత దర్శకుడు సందీప్ కుమార్ మాట్లాడుతూ కథానుగుణంగా పాటలు, నేపథ్య సంగీతం అద్భుతంగా కుదిరాయని చెప్పగా, డ్యాన్స్ మాస్టర్ భాను మాట్లాడుతూ దర్శకుడు అవ్వాలనే వీరాస్వామి కల ఈ సినిమాతో నెరవేరిందని, నృత్య దర్శకుడిగానే కాకుండా దర్శకుడిగా ప్రభుదేవా, లారెన్స్ మాదిరిగా వీరాస్వామి గొప్ప పేరు తెచ్చుకోవాలని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు