సీత ఆన్ ది రోడ్ తో చాలా యాక్సిడెటల్ గా సినీరంగ ప్రవేశం చేసిన జయశ్రీ రాచకొండ, మల్లేశం, తిమ్మరుసు, రిపబ్లిక్, వర్జిన్ స్టోరీ, నాతిచరామి వంటి చిత్రాలతో తన ప్రతిభను నిరూపించుకొని కెరీర్ లో అడుగులు ముందుకు వేస్తున్నారు. ఒక లాయర్ గా పలు రకాల కేసులను డీల్ చేసి ఉండడం, వివిధ రకాల మనస్తత్వాలు కలిగిన వ్యక్తులను పరిశీలించి ఉండడం కలిసి రావడంతో, చాలా తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ లాయర్ టర్నడ్ యాక్టర్, తను పోషించే ప్రతి పాత్రను ప్రేమిస్తూ, ప్రతి సినిమాతో నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నాను అని అన్నారు.
లాయర్, జడ్జి, డాక్టర్, పోలీస్ ఆఫీసర్ పాత్రలు మొదలుకుని ప్రధానమంత్రి వంటి పవర్ ఫుల్ రోల్స్ తో మెప్పించిన జయశ్రీ, అమ్మ, అత్తయ్య, అక్క, వదిన, బామ్మ వంటి అన్ని రకాల పాత్రల్లోనూ సునాయాసంగా ఒదిగిపోతూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నారు. సినిమాలతో పాటు, వెబ్ సిరీస్, టివి కమర్షియల్స్ చేసిన రాచకొండ నటించిన రామ్ సేతు (అక్షయ్ కుమార్ – హిందీ), నిఖిల్ కార్తికేయ -2, వి.ఎన్.ఆదిత్య వాళ్లిద్దరి మధ్య, త్రిగున్ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్, ఎంతవారు గాని తదితర చిత్రాలు విడుదల కావాల్సి ఉన్నాయి.
గౌతమ్ రాచిరాజు దర్శకత్వంలో జయశ్రీ నటించిన ఎక్స్టెండెడ్ వారంటి పలు ప్రతిష్టాత్మక అవార్డులు గెలుచుకోగా, టోక్యో ఫిల్మ్ ఫెస్టివల్ లో బెస్ట్ యాక్ట్రెస్ గా ఎంపికవ్వడం రాచకొండ ప్రతిభకు తార్కాణంగా చెప్పవచ్చు. నటిగా వీలైనన్ని వైవిధ్యమైన పాత్రలు పోషించి మెప్పించాలన్నదే తన లక్ష్యం అని అన్నారు.