సినిమాటోగ్రఫర్ కుశేందర్ రమేష్ రెడ్డి ప్రయాణం

సినిమాటోగ్రఫర్ కుశేందర్ రమేష్ రెడ్డి ప్రయాణం

Published on Jan 30, 2025 10:30 AM IST

ఒక మనిషి ఆలోచనతో మొదలై ఎన్నో అద్భుతాలును సృష్టించేదే సినిమా. మహాసముద్రం లాంటి ఈ సినీ ప్రపంచంలో వైవిధ్యమయిన కథ కథనాలతో ప్రేక్షకుల మనసును మెప్పించడానికి దర్శకుల ప్రతిభతో పాటు ప్రతి సన్నివేషాన్ని కథకు అనుగుణంగా ప్రేక్షకుల మనసును ఆకట్టుకునేలా చిత్రీకరించటంలో సినిమాటోగ్రఫర్ పాత్ర చాల ప్రధానమైనది. ప్రతి సన్నివేశాన్ని సగటు ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోయేలా తనకంటూ ఉన్న శైలితో నవతరాన్ని ఆకట్టుకుంటున్న నేటితరం సినిమాటోగ్రఫర్ కుశేందర్ రమేష్ రెడ్డి.

హైదరాబాద్‌లో పుట్టిపెరిగిన మన తెలుగోడే ఈ కుశేందర్ రమేష్ రెడ్డి. చిన్నతనం నుంచే ఫోటోగ్రఫీ పట్ల గొప్ప ఆసక్తి కలిగిన కుశేందర్ ఇప్పుడు భారీ సినిమాలకు డిఓపి గా పని చేస్తూ అటు ప్రేక్షకుల ఇటు విశ్లేషకుల మన్ననలు పొందుతున్నారు. BFA గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి కెకె సెంథిల్ కుమార్ దగ్గర ‘ఈగ’, ‘బాహుబలి 1’, ‘బాహుబలి 2’ అలాగే ‘RRR’ చిత్రాలకు చీఫ్ అసోసియేట్‌గా పనిచేస్తూ అంచెలంచెలుగా తన ప్రావీణ్యాన్ని పెంచుకుంటూ సెకండ్ కెమెరాకి ఆపరేటర్‌గా కూడా పనిచేసే స్థాయికి ఎదిగి భారీ సినిమాల నిర్మాణంలో భాగమయ్యారు.

ఆ తర్వాత ఇండిపెండెంట్‌గా ఒక భారీ టీవీ సిరీస్‌తో పాటు యాడ్ ఫిలిమ్స్ కూడా చేశారు. 2022లో కీరవాణి తనయుడు శ్రీ సింహ కోడూరి హీరోగా నటించిన ‘బాగ్ సాలే’ మూవీతో తన కెరీర్‌ని మొదలుపెట్టి, రీసెంట్ గా వచ్చిన ‘మా ఊరి పొలిమేర 2’ తో గొప్ప విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. చరిత్ర చీకటిలో కప్పబడిన ఒక కన్నీటి గాధని ‘రజాకార్’ సినిమాలో ప్రతి సన్నివేశం మన కళ్ళముందే జరుగుతున్నట్టుగా, అప్పటి చరిత్ర ప్రేక్షకుడి మనసుకు హత్తుకునేలా తన సినిమాటోగ్రఫీతో అందరి కళ్ళు చెమర్చేలా తన విజువల్స్ మాట్లాడుతున్నాయని ప్రేక్షకులు చెప్పుకునే స్థాయికి ఎదిగారు.

ప్రస్తుతం వానర సెల్యూలాయిడ్, డైరెక్టర్ మారుతి సమర్పణలో మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో వస్తున్న ‘బార్బరిక్’ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించారు. అలాగే పొలిమేర దర్శకుడు అనిల్ విశ్వనాధ్ కథ కథనంతో నాని దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా పొలిమేర ఫెమ్ కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా SSS ప్రొడక్షన్ హౌస్ చిట్టూరి శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రానికి ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా కంటెంట్ ఉన్న కథలని ఎంచుకుని తనదైన ప్రత్యేక శైలితో దర్శకుల ఆలోచలనలకి దృశ్యరూపం అందించాలని, తనదైన మార్క్‌ని క్రియేట్ చేసుకోవాలని ఉందని సినిమాటోగ్రఫర్ కుశేందర్ రమేష్ రెడ్డి మీడియాతో చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు