ఒకరికి ఒకరు, రోజాపూలు, స్నేహితులు వంటి సినిమలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన హీరో శ్రీరామ్. ఆయన పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేశారు. ఇక ఇప్పుడు మరోసారి లీడ్ రోల్ లో నటించేందుకు సిద్ధమయ్యారు. వీ4 క్రియేషన్స్ బ్యానర్ పై కంచర్ల సత్యనారాయణరెడ్డి, గట్టు విజయ్ గౌడ్, చిన్ని చందు, వట్టం రాఘవేంద్ర, సముద్రాల మహేశ్ గౌడ్ నిర్మిస్తున్న ‘కోడి బుర్ర’ సినిమాను ఈరోజు హైదరాబాద్ లోని ఫిలింనగర్ దైవసన్నిధానంలో లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సినిమాను చంద్రశేఖర్ కానూరి డైరెక్ట్ చేస్తున్నారు. శృతి మీనన్, ఆరుషి హీరోయిన్లుగా నటిస్తుండగా.. మహావీర్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్ క్లాప్ నివ్వగా దర్శకుడు భరత్ కమ్మ స్క్రిప్ట్ అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. ‘కోడి బుర్ర’ చిత్రానికి మంచి కథను ఎంచుకున్నారు. ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని.. హీరో శ్రీరామ్, హీరోయిన్ శృతి మీనన్, నిర్మాతలైన నా మిత్రులతో పాటు చిత్ర యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా.. అని అన్నారు.
చిత్ర దర్శకుడు చంద్రశేఖర్ కానూరి మాట్లాడుతూ.. ”మా ‘కోడి బుర్ర’ మూవీలో శ్రీరామ్ ని కొత్తగా చూస్తారు. ఆయన ఇప్పటిదాకా లవ్, రొమాంటిక్ తరహా చిత్రాలు చేశారు. ‘కోడి బుర్ర’ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారు. హీరోయిన్ శృతి మీనన్ డాక్టర్ రోల్ చేస్తోంది. ‘కోడి బుర్ర’ అందరికీ నచ్చేలా మంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమా అవుతుంది.” అని అన్నారు.
ఇక హీరో శ్రీరామ్ మాట్లాడుతూ.. ‘క్రైమ్ థ్రిల్లర్ కథతో మీ ముందుకు రాబోతున్నాను. ఈ సినిమా టైటిల్ వినగానే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. డైరెక్టర్ చంద్రశేఖర్ ‘కోడి బుర్ర’ చిత్రాన్ని అందరికీ నచ్చేలా ఆసక్తికరంగా తెరకెక్కిస్తున్నారు. ఒక ఇంట్రెస్టింగ్ మూవీలో పార్ట్ కావడం హ్యాపీగా ఉంది. మా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ కు థ్యాంక్స్.’ అని అన్నారు.
హీరోయిన్ శృతి మీనన్ మాట్లాడుతూ..’కోడి బుర్ర’ చిత్రంతో తెలుగులోకి అడుగుపెడుతున్నాను. తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రంతో పరిచయం కావడం సంతోషంగా ఉందని అన్నారు.
నిర్మాత గట్టు విజయ్ మాట్లాడుతూ.. ”కోడి బుర్ర’ సినిమా ఈ నెల 22వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. హీరో శ్రీరామ్ ఈ కథ విన్న వెంటనే సింగిల్ సిట్టింగ్ లో ఓకే చేశారు. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నాం. అలాగే శృతి, ఆరుషి హీరోయిన్స్ గా కనిపించనున్నారు.’ అన్నారు.
మరో నిర్మాత కంచర్ల సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ.. ”శ్రీరామ్ గారితో సినిమా ప్రొడ్యూస్ చేస్తుండటం సంతోషంగా ఉంది. ఈ చిత్రాన్ని నా మిత్రులు గట్టు విజయ్ గౌడ్, చిన్ని చందు, వట్టం రాఘవేంద్ర, సముద్రాల మహేశ్ గౌడ్ తో కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నాను. కోడి బుర్ర సినిమా సక్సెస్ అయ్యి మా బ్యానర్ కు మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాం.” అని అన్నారు.