మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తాజా చిత్రం ‘దృశ్యం 2’ అమెజాన్ ద్వారా విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విజయం కంటే మోహన్ లాల్ ఇంకొక విషయానికి ఎక్కువగా సంతోషిస్తున్నారు. అదే ఆయన కుమార్తె విస్మయ మోహన్ లాల్. విస్మయ మోహన్ లాల్ ఇటీవలే ‘గ్రెయిన్స్ ఆఫ్ స్టార్డస్ట్’ పేరుతో ఒక పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకానికి అన్ని వైపుల నుండి మంచి రివ్యూలు వస్తున్నాయి. ఈ పుస్తకాన్ని మోహన్ లాల్ బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్కు బహుమతిగా పంపారు.
అందుకున్న వెంటనే అమితాబ్ ఆ పుస్తకాన్ని చదివారు. చదివాక ఫీడ్ బ్యాక్ చెబుతూ ‘నేను ఎంతో అభిమానించే వ్యక్తి మోహన్ లాల్. ఆయన కూతురు విస్మయ రాసిన గ్రెయిన్స్ ఆఫ్ స్టార్డస్ట్ పుస్తకాన్ని నాకు పంపారు. ఊహాజనితంగా రాసిన ఈ పుస్తకం సృజనాత్మకతతో కూడిన కవితలు, పెయింటింగ్తో నిండి ఉంది. కవిత్వంతో నిండి ఉన్న ఈ పుస్తకం బాగా నచ్చింది. ఈ ప్రతిభ వారసత్వంతోనే వస్తుంది. మై బెస్ట్ విషెస్ టూ విస్మయ’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో మోహన్ లాల్ పొంగిపోతున్నారు. ‘తండ్రిగా ఇది గర్వించే సమయం. ఓ గొప్ప వ్యక్తి నుంచి నా కూతురు ప్రశంసలు అందుకుంది. థ్యాంక్యూ అమితాబ్ బచ్చన్ సార్’ అంటూ సమాధానం ఇచ్చారు.