కొండా సురేఖ వివాదం.. కోర్టుకెక్కిన నాగార్జున!

కొండా సురేఖ వివాదం.. కోర్టుకెక్కిన నాగార్జున!

Published on Oct 3, 2024 8:05 PM IST

తెలంగాణ మహిళా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఎలాంటి దుమారం రేపాయో మనం చూస్తున్నాం. నాగచైతన్య, సమంత విడాకులపై ఆమె చేసిన తీవ్ర ఆరోపణలకు యావత్ తెలుగు ఇండస్ట్రీ ఒక్క తాటిపైకి వచ్చి ఆమెపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సదరు మంత్రి సమంత గురించి ఎలాంటి తాను ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని, కేవలం రాజకీయ కోణంలోనే చేశానని, అయితే ఆమె చేసిన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లుగా మంత్రి సోషల్ మీడియాలో తెలిపింది.

కానీ, ఆమె చేసిన వ్యాఖ్యలకు అక్కినేని కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబ పరువును బజారుకు లాగిన మంత్రి కొండా సురేఖపై అక్కినేని నాగార్జున తాజాగా కోర్టును ఆశ్రయించారు. తమ కుటుంబం కొన్నేళ్లుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా పరువుప్రతిష్టలతో ఉందని, ఇప్పుడు ఇలా ఓ రాజకీయ నేత తమ కుటుంబంపై నిరాధారమైన కామెంట్స్ చేయడంపట్ల వారి ప్రతిష్టకు భంగం వాటిల్లిందంటూ నాగార్జున కోర్టులో పరువు నష్టం దావా వేశాడు.

నాంపల్లి కోర్టులో ఈ మేరకు కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశాడు నాగార్జున. తన కుటుంబం గౌరవాన్ని, ప్రతిష్టను కొండా సురేఖ దెబ్బతీశారని నాగార్జున కేసు వేశారు. ఇక ఈ పిటీషన్‌పై కోర్టు శుక్రవారం రోజున విచారణ చేపట్టనుంది. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు చిలిచిలికి గాలివానలా మారడం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు