పవన్ మేనియా ముందు కరోనా భయం ఓడింది

పవన్ మేనియా ముందు కరోనా భయం ఓడింది

Published on Apr 9, 2021 8:20 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ చిత్రం ‘వకీల్ సాబ్’ ఈరోజే థియేటర్లలోకి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మెజారిటీ సినిమా హాళ్లలో ఈ సినిమానే ప్రదర్శితమవుతోంది. డిస్ట్రిబ్యూటర్లు భారీ ధరలు చెల్లించి హక్కులు కొనుగోలుచేశారు. మొదటిరోజు కనీసం రూ.35 కోట్ల షేర్ మార్క్ తగిలితే కానీ డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్లోకి వెళ్లరు. మామూలు సమయంలో అయితే పవన్ సినిమాకు ఈ మొత్తం పెద్ద లెక్కేమీ కాదు. కానీ కరోనా టైమ్. కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో సినిమాకు వెళ్ళాలా వద్దా అనే డైలమాలో పడ్డారు ప్రేక్షకులు.

దీంతో మొదటిరోజు ఓపెనింగ్స్ ఎఫెక్ట్ అవుతాయేమో, అనుకున్నంత రాకపోతే పరిస్థితి ఏమిటా అనే భయం మొదలైంది డిస్ట్రిబ్యూటర్లలో. కానీ అలా జరగలేదు. పవన్ కళ్యాణ్ అభిమానులు కరోనా భయాన్ని లెక్కచేయలేదు. ‘వకీల్ సాబ్’ థియేటర్లకు పోటెత్తారు. దాదాపు అన్ని చోట్లా హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ప్రతిచోటా పండుగ వాతావరణం నెలకొంది. మామూలు రోజుల్లో ఎలాగైతే పవన్ సినిమాకు హడావుడి ఉంటుందో ఈరోజు కూడా అలానే ఉంది. కేవలం అభిమానులే కాదు సినీ ప్రేమికులు, ఆడవారు, పెద్దవాళ్ళు కూడ కరోనా భయాన్ని పక్కనబెట్టి అన్ని జాగ్రత్తలతో సినిమాను వీక్షిస్తున్నారు. మొత్తానికి పవన్ మేనియా ముందు కరోనా భయం పెద్దగా పనిచేయలేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు