ఇంటర్వ్యూ : మనలో ఒకరి కథలా ఉండే సినిమా ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ – డైరెక్టర్ శ్రీనివాస్ అవసరాల

ఇంటర్వ్యూ : మనలో ఒకరి కథలా ఉండే సినిమా ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ – డైరెక్టర్ శ్రీనివాస్ అవసరాల

Published on Mar 4, 2023 7:23 PM IST

యువ నటుడు, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల లేటెస్ట్ గా దర్శకత్వం వహిస్తున్న సినిమా ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. నాగశౌర్య హీరోగా మాళవిక నాయర్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ మూవీని ప్రముఖ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తో పాటు దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తునాయి. కాగా ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ మూవీ ని టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి గ్రాండ్ లెవెల్లో నిర్మించారు. గతంలో ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద సినిమాలతో రచయితగా, దర్శకుడిగా ఆడియన్స్ లో మంచి క్రేజ్ అందుకున్న శ్రీనివాస్ అవసరాల ఈ మూవీని కూడా ఎంతో ఆకట్టుకునే విధంగా తెరకెక్కించినట్లు చెప్తోంది యూనిట్. ఇక ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, పోస్టర్స్ అన్ని కూడా ఆడియన్స్ ని ఆకట్టుకుని ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. కాగా ఈ మూవీ మార్చి 17న విడుదల కానున్న సందర్భంగా దర్శకుడు శ్రీనివాస్ అవసరాల ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు.

 

సినిమాకి ఈ టైటిల్ పెట్టడానికి కారణమేంటి?

ఇది చాలా సహజంగా ఉండే సినిమా. పాత్రలు, సంభాషణలు సహజంగా ఉంటాయి. నిజంగా ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటుంటే ఎలా ఉంటుందో అంత సహజంగా ఉండాలని తీసిన సినిమా ఇది. ఈ కథ కూడా నిజ జీవితంలో నేను చూసిన కొన్ని సంఘటనల ఆధారంగా రాసుకున్నాను. ఇది జనాలకు దగ్గరగా ఉండే కథ. మనకు తెలిసిన కథలా, మనలో ఒకరి కథలా ఉంటుంది. అంత సహజమైన సినిమాకి ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి లాంటి టైటిల్ పెడితే బాగుంటుంది అనిపించింది. అంతే రిజిస్టర్ చేయించి అనౌన్స్ చేసాము.

 

ఈ సినిమాలో కొత్తగా ఏమైనా చూపించబోతున్నారా?

కొత్తగా ఏముంది అనేది మీకు సినిమా చూసిన తరువాత అర్థమవుతుంది. నాది నాగ శౌర్య కాంబినేషన్ లో సినిమా అనగానే అందరూ మంచి అంచనాలతో ఊహించుకుంటారు. అయితే ఈ సినిమా స్క్రిప్టెడ్ లాగా అనిపించదు. నిజ జీవితంలో పాత్రలు ఎలా ప్రవర్తిస్తాయి, ఎలా మాట్లాడుతారో అలాగే ఈ సినిమా ఉంటుంది. ట్రైలర్ చూశాక ఈ సినిమా ఎలా ఉండబోతుందో మీకో అవగాహన వస్తుంది.

 

మీరు నెమ్మదిగా సినిమాలు తీయడానికి కారణం?

నేను కథ రాయడానికి ఏడాది, ఏడాదిన్నర సమయం తీసుకుంటాను. ఈ సినిమా 2019లో మొదలుపెట్టాను. 2020 లో యూకే, యూఎస్ లో షూట్ చేయడానికి సన్నాహాలు చేస్తుండగా కోవిడ్ కారణంగా వీసాలు ఇవ్వడం ఆపేశారు. ఆ తరువాత 2022 లో యూకే వెళ్లి షూటింగ్ పూర్తి చేశాం. అప్పుడు కూడా 40 మందికి వీసాలు అప్లై చేస్తే పదిమందికే ఇచ్చారు. ఆ విధంగా చిత్రీకరణ సందర్భంగా కొంత ఇబ్బంది ఎదురైనా ఎంతో పక్కాగా తీసాము.

 

మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణి మాలిక్ గారితో ప్రయాణం?

కళ్యాణి మాలిక్ గారు అష్టాచమ్మా సినిమా సమయం నుంచే తెలుసు. మా ఇద్దరికీ మంచి అనుబంధం ఉంది. మా ఆలోచనలు, అభిప్రాయాలు ఎలా ఉంటాయో ఒకరికొకరికి తెలుసు. ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద సినిమాలు ఆయనే చేశారు. నేనంటే కొంచెం ఎక్కువ ప్రేమ ఆయనకు. ఆ అనుబంధం వల్లే సినిమా సినిమాకి ఇంకా మంచి అవుట్ పుట్ వస్తుంది. సినిమాలో సాంగ్స్ అన్ని మంచి ఆదరణ అందుకున్నాయి.

 

వరుసగా నాగశౌర్యతోనే సినిమాలు చేయడానికి రీజన్ ?

నాగశౌర్య నాకు చాలా ఇష్టమైన నటుడు. యూకేలో షూటింగ్ కి పదిమందితోనే వెళ్లడంతో అక్కడ మేం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అయితే నాగశౌర్య తన నటనతో ఆ ఇబ్బందులను మర్చిపోయేలా చేసేవాడు. ప్రతిరోజూ అవుట్ పుట్ చూసుకొని సంతృప్తి కలిగేది. ఇది ముఖ్యంగా నటన మీద ఆధారపడిన సినిమా. నాగశౌర్య ఎంత బాగా నటించాడనేది మీకు సినిమా చూశాక తెలుస్తుంది. అయితే నేను కథ రాసుకునేటప్పుడు ఫలానా నటుడిని దృష్టిలో పెట్టుకొని రాయను. కథ రాసుకున్నాక దానికి తగ్గ నటీనటులను, సాంకేతిక నిపుణులను ఎంచుకుంటాను. మొత్తంగా తనతో నా కాంబినేషన్ లో రానున్న ఈ మూవీ కూడా మంచి సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది.

 

తెలుగు సినిమాకి ఈ తరహా సినిమాని తీసుకురావడం ఎలా ఉంది ?

బిఫోర్‌ సన్‌రైజ్‌ అనే ఇంగ్లీష్ సినిమా నాకు చాలా ఇష్టం. ఆ తరహా సినిమా తెలుగులో చేయాలి అనిపించింది. ఇలాంటి సినిమాలకు డైలాగ్స్ స్క్రిప్టెడ్ ఉంటే సహజత్వం పోతుంది. నటీనటులు సహజంగా మాట్లాడున్నట్లు ఉండాలి. దర్శకుడిగా నా బలం నటీనటుల నుంచి సహజ నటన రాబట్టుకోవడం. నేను ఫ్రేమ్ లో మొదట నటీనటులు అభినయం ఎలా ఉంది అనేదే చూస్తాను. ఆ నమ్మకంతోనే ఈ సినిమా చేశాను. మా నిర్మాతలు నన్ను, నా కథని, ఈ ప్రయోగాన్ని నమ్మారు. అలానే ప్రేక్షకులని కూడా ఇది అలరిస్తుంది.

 

టీజర్ లో ఉన్న ముద్దు సన్నివేశం గురించి మాళవిక గారికి ముందే చెప్పారా?

నేను కథ చెప్పినప్పుడే ఉన్న సన్నివేశాలన్నీ చెప్పాను. కథ విన్నాక ఆమె ఎమోషనల్ గా స్పందించారు. ఆమె కథకి అంతలా కనెక్ట్ అవ్వడంతో ఈ సినిమాలో కూడా అంత ఎమోషన్ తీసుకురాగలదనే నమ్మకం కలిగింది. ప్రతి సన్నివేశం ఆమెకు ముందుగానే చెప్పాను. ఆ సన్నివేశానికి సరైన కారణాలు ఉంటే, కథకి ఖచ్చితంగా అవసరం అనిపిస్తే నటీనటులు చేయడానికి సిద్ధపడతారు అనేది నా అభిప్రాయం. వారందరూ ఒప్పుకుని సహకరిస్తేనే సినిమా ఔట్ పుట్ బాగుంటుంది.

 

బ్రహ్మాస్త్ర, అవతార్-2 సినిమాలకు తెలుగులో మాటలు రాసే అవకాశం ఎలా వచ్చింది?

ఒకసారి టీమ్ ఫోన్ చేసి బ్రహ్మాస్త్రకు రాస్తారా అని అడిగారు. అప్పటికే ఆ సినిమా గురించి నాకు తెలుసు. నాగార్జున గారు కూడా నటిస్తున్నారని తెలుసు. పెద్ద సినిమా, ఎక్కువమంది చేరువయ్యే సినిమా కావడంతో వెంటనే రాయడానికి అంగీకరించాను. ఆ సినిమా చూసి నాకు అవతార్-2 అవకాశం ఇచ్చారు. హిందీ సినిమాలతో పోల్చితే ఇంగ్లీష్ సినిమాలకు తెలుగు సంభాషణలు రాయడం కొంచెం కష్టం. దానిని ఛాలెంజింగ్ గా తీసుకుని అవతార్-2 కి రాశాను. అవి అందరి మెప్పు అందుకుని మరింత మంచి పేరు తీసుకురావడం ఎంతో ఆనందంగా అనిపించింది.

 

తదుపరి సినిమాలు?

ప్రస్తుతం ఒక కథ అనుకుంటున్నాను. ఇంకా నేరేట్ చేసేదాకా రాలేదు. కథ పూర్తయ్యాక నటీనటుల ఎంపిక జరుగుతుంది. నానితో మంచి అనుబంధముంది. ఆయనతో సినిమా చేయాలని ఉంది. కానీ దానికి సమయముంది. నటుడిగా కన్యాశుల్కం అనే వెబ్ సిరీస్ చేశాను. త్వరలోనే విడుదల కానుంది. నటుడిగా తృప్తినిచ్ఛే పాత్రలు మాత్రమే చేస్తూ ఎక్కువగా రచన, దర్శకత్వం మీద దృష్టి పెట్టాలి అనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని మంచి ప్రాజక్ట్స్ తో మీరు ఆడియన్స్ ని అలరించాలి.

థాంక్యూ ఆల్ ది బెస్ట్

సంబంధిత సమాచారం

తాజా వార్తలు