ఇంటర్వ్యూ: నరేశ్ – మైత్రీ మూవీ మేకర్స్ మంచి కుటుంబ కథా చిత్రాలకు ఆణిముత్యంలాంటి సంస్థ

ఇంటర్వ్యూ: నరేశ్ – మైత్రీ మూవీ మేకర్స్ మంచి కుటుంబ కథా చిత్రాలకు ఆణిముత్యంలాంటి సంస్థ

Published on Jun 8, 2022 11:01 PM IST

నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘అంటే సుందరానికీ. ఈ చిత్రం ట్రైలర్ విడుదలయ్యాక భారీ అంచనాలు నెలకొన్నాయి. నజ్రియా ఫహద్ తెలుగులో పరిచయం కాబోతుంది. జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతున్న నేపధ్యంలో నాని తండ్రిగా నటించిన నరేశ్ వి.కె. మీడియాతో పలు విశేషాలు పంచుకున్నారు.

 

మీ కెరీర్‌లో ఎన్నో పాత్రలను పండించారు. ‘అంటే సుందరానికీ’ చిత్రంలో మీ పాత్ర ఎంత వైవిధ్యంగా ఉండబోతోంది?

ఈ ఎరాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అద్భుతమైన పాత్రలు పోషించడం అదృష్టం. నేను పోషించిన తండ్రి పాత్రలకు ఆడపిల్లల నుంచి మంచి ఫాలోయింగ్ వచ్చింది. అ..ఆ., భలే భలే మగాడివోయ్, సమ్మోహనం వంటి చిత్రాల్లో బెస్ట్ ఫాదర్‌గా నిలిచాయి. ‘అంటే సుందరానికీ’ సినిమాలో నానికీ నాకు మంచి ర్యాపో వుంది. నాని కామెడీ టైమింగ్ చాలా స్పార్క్ వుంటుంది. సెకన్లో క్యాచ్ చేసేస్తాడు. నేను ఆ స్కూల్ నుంచి వచ్చినవాడిని కనుక నాకు తెలుసు. నేను ఇందులో చేసిన ఫాదర్ పాత్ర ‘ది బెస్ట్’ అని చెప్పగలను. దానికి రెండు కారణాలున్నాయి. మొదటిది దర్శకుడు రూపుదిద్దిన విధానం, రెండోది.. నాని, నాకూ మధ్య కామెడీ టైమింగ్. ఎమోషన్‌ను క్యారీ చేస్తూ ఆడియన్స్‌ను నవ్వించే పాత్ర. కీలకమైన పాత్ర ఇది. నానితో ఫాదర్ గా, దేవదాసులో బ్రదర్ గా చేశాను. మళ్ళీ ఫాదర్ గా చేశాను. మా ఇద్దరి మధ్య డిఫరెంట్ ఎమోషన్స్ కూడినవి. మేమిద్దరం నటిస్తుంటే సెట్లో అందరూ లీనమైపోయి ఓన్ చేసుకున్నారు. అలాగే రోహిణి పాత్ర కూడా. తను మంచి నటి. ఈ సినిమా తర్వాత నెక్ట్స్ లెవల్ పాత్ర కోసం నేను ఎదురుచూడాల్సి ఉంటుంది. నానికి చాలా కాలం తర్వాత హ్యూమర్ జోనర్ పడడం అదృష్టం.

 

మైత్రీ మూవీస్ నిర్మాణ సంస్థలో పనిచేయడం ఎలా వుంది?

ఈ మధ్య వరుసగా యాక్షన్ సినిమాలు వచ్చాయి. అన్నీ హిట్ అయి తెలుగులో విజయపతాకాన్ని ఎగురవేస్తున్నాయి. ఇలాంటి టైంలో కుటుంబకథా చిత్రాలు తగ్గాయి. మైత్రీ మూవీ మేకర్స్ మంచి కుటుంబకథా చిత్రాలకు ఆణిముత్యంలాంటి సంస్థ అని చెప్పొచ్చు. మెమొరబుల్ హిట్ అవుతుంది. మైత్రీనుంచి పుష్ప, సర్కారువారి పాట ఇలా వరుస విజయాల్లో ఈ సినిమా మరోటి అవుతుంది. ముఖ్యంగా మైత్రీ మూవీస్ నిర్మాణ విలువలు, నటీనటులకు కంఫర్ట్ ఇస్తారు. వారు మితబాషీయులు. వారు ఎంచుకునే కథలు హైలెట్ అవుతాయి. అవే వారి విజయానికి నిదర్శనం.

 

మీరు చాలా పాత్రలు పోషించారు. బ్రాహ్మణుడి పాత్ర చేయడం ఎలా ఉంది?

గతంలో జంథ్యాల గారి సినిమాల్లో బ్రాహ్మణుడి పాత్రలు చేశాను. ఆ తర్వాత ఇలాంటి పాత్ర ఏదీ చేయలేదు. మొదటి లాక్డౌన్లో వివేక్ ఆత్రేయగారు కథ రాసుకున్నప్పుడే నన్ను ఊహించి రాసుకున్నారని చెప్పారు. కరోనా విపరీతంగా వున్న టైంలో కూడా కుటుంబంలా ఈ సినిమాకు అందరం పనిచేశాం. బ్రాహ్మణుడి పాత్ర కోసం బరువు తగ్గాను. మేకోవర్ మార్చుకున్నా. శైవత్వం వున్న బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఆవిధంగా తీర్చిదిద్దుకున్నాను. నా ఫేస్ నాకే బోర్ కొట్టకూకడదు. అందుకే మేకోవర్ చేసుకుంటాను. ఈ సినిమా ట్రైలర్ విడుదలయ్యాక నాని, నా కాంబినేషన్ అదిరిపోయిందని చాలామంది చెప్పారు. హీరోయిన్ కూడా మలయాళంలో స్టార్. తను బాగా చేసింది.

 

నిజ జీవితంలో మీ కుమారుడితో ఫ్రెండ్లీగా వుంటారు. కానీ ఇందులో నాని మిమ్మల్ని ఇరిటేట్ చేస్తాడు. ఎలా అనిపించింది?

ఇప్పటి జనరేషన్‌లో తండ్రి కొడుకుతో ఫ్రెండ్లీగానే వుండాలి. లేదంటే తేడాలు వచ్చేస్తాయి. ఈ సినిమాలో సాంప్రదాయాలు, కట్టుబాట్లు గల కుటుంబం కనుక చిన్నప్పటినుంచి ఒక పద్దతిలో నాని పెరిగినవాడు. అలాంటి వ్యక్తి స్వంత నిర్ణయాలు తీసుకుంటే ఎలా వుంటుందనేది సినిమా. ఇప్పటివరకు పెండ్లిచూపులు, పెండ్లి తంతు వుండేవి. కానీ కాలం మారడంతో రివర్స్ అయింది. అందుకే నాని పాత్రకు ఇప్పటి జనరేషన్ బాగా కనెక్ట్ అవుతారు. రెండు భిన్నమైన మనస్తత్వాలు గల కుటుంబాల మధ్య ఏం జరిగింది అనేది ఆసక్తిగా వుంటుంది. నేను ఇప్పటివరకు 200కు పైగా సినిమాలు చేశాను. కానీ ఈ సినిమాలో బ్రాహ్మణుని పాత్రకు యాసలో డబ్బింగ్ చెప్పడానికి 9 రోజులు పట్టింది. ఇలా ఎప్పుడూ జరగలేదు. ఇదంతా వివేక్ ఆత్రేయ డ్రాఫ్టింగ్ వల్లే. ఆయనకు మంచి క్లారిటీ వుంది.

 

ట్రైలర్‌లో మూలికలు సీన్ బాగా వర్కవుట్ అయిందే?

ఆ సీన్ చేసేటప్పుడు సెట్లో అందరూ నవ్వేశారు. నేను నవ్వు ఆపుకోలేకపోయాను. దాంతో మూడు టేక్లు చేయాల్సివచ్చింది. నాదేకాదు అన్ని పాత్రలు అలానే చేశాయి. నదియా, పెరుమాళ్ళు పాత్రలు బాగా వచ్చాయి. వేరియేషన్స్ అద్భుతంగా చిత్రీకరించారు. ఈ చిత్రం ఆల్ కమ్యూనిటీ అండ్ ఆల్ లాంగ్వేజ్ ఫిలిం అని చెప్పవచ్చు.

 

కులాలు అనేది సున్నితమైన అంశం దాన్ని ఎలా బ్యాలన్స్ చేశారు?

ఆ క్రెడిట్ అంతా దర్శకుడు వివేక్‌దే. ఏ ఒక్క కమ్యూనిటీని నొప్పించకుండా చేయడం అనేది గ్రేట్. ఈ సినిమా చూస్తే రెండు కమ్యూనిటీ వారు ఎంజాయ్ చేస్తారు. ఈ రోజుల్లో కులాలు, మతాలు, ఖండాంతరాలు దాటి పెండ్లిళ్లు జరుగుతున్నాయి. కనుక ఇది నేటి జనరేషన్‌కు ఫర్ ఫెక్ట్ ఫిలిం. ఒకప్పటి పెండ్లి తంతులు దూరమయి సహజీవనం వచ్చేస్తున్నాయ్. ఇక ఈ సినిమాకు నికేత్ బొమ్మి కెమెరా నైపుణ్యం అద్భుతంగా వుంది. మొత్తంగా చెప్పాలంటే ఈ సినిమా 16 కూరల తెలుగు కంచం.

 

ఈ చిత్రాన్ని మరో చరిత్ర, సీతాకోకచిలుకతో పోల్చవచ్చా?

అలా చెప్పలేం. అవి వేరే సినిమాలు ఇది వేరే సినిమా. నటుడిగా నాకు తృప్తినిచ్చిన సినిమా. నా కెరీర్ ను తర్వాత స్థాయికి తీసుకెళ్ళే సినిమా అవుతుంది.

 

ఈ మధ్య కామెడీ చిత్రాలు ఎక్కువయ్యాయి. వాటి గురించి మీ విశ్లేషణ?

కామెడీ సినిమాలు గతంలో జంథ్యాల, వంశీ, రేలంగి నరసింహారావు చిత్రాలు వచ్చాయి. ఇవాళ నేటి ఆడియన్స్ పల్స్ బట్టి సినిమాలు తీస్తున్నారు. అప్పట్లో తెలుగు సినిమాకు రచయిత, దర్శకుడు ఒక్కరే. దానివల్ల మంచి సినిమాలు వచ్చేవి. దర్శకుడు, రచయిత వేరు వేరు అయితే సరిగ్గా తీయడం కష్టం. మరలా ఇప్పుడు పాత రోజులు మాదిరే రచయిత, దర్శకుడు ఒక్కరే అయ్యేలా యంగ్ దర్శకులు రావడం ఆనందంగా వుంది. అయితే కామెడీ సినిమాలు రాయడం కష్టం. తీయడం మరీ కష్టం. నటీనటులు కుదరడం మరింత కష్టం. ఈ సినిమాలో అన్ని భాషల నటీనటులున్నారు. వారంతా టైమింగ్ వున్న వారే. నా మదర్ గా భిక్షు గారి భార్య నటించింది. తను బాగా నటించింది. ఏది ఏమైనా ఒక సినిమా హిట్ అయితే వరసగా కొద్దికాలం అవే వస్తుంటాయి. మారుతీ దర్శకత్వంలో ప్రేమకథా చిత్రం వచ్చాక హారర్ కామెడీ వరుసగా వచ్చాయి.

 

కొత్త సినిమాలు?

నేను లీడ్ రోల్‌గా రెండు సినిమాలు చేస్తున్నాను. 38 ఏళ్ళ పాత్ర కూడా చేస్తున్నా.

 

కామెడీ సినిమాలంటే నటీనటులు ఎక్కువగా వుంటారు. సీనియర్‌గా మీకు మిగతా వారి సపోర్ట్ ఎలా వుంటుంది?

జనరల్‌గా నేను ఎవరికీ క్లాస్ పీకను. కొత్తవారైనా పాతవారైనా నాకు కంఫర్ట్ జోన్ ఇస్తారు. ఒకరినొకరు ఓవర్ టేక్ చేయడం వుండదు. నేను దర్శకుడి నటుడ్ని. నటించడం కంటే ప్రవర్తిస్తాను. అదే మా అమ్మగారు చెప్పారు. అదే ఫాలో అవుతున్నా. నటుడికి బాడీ లాంగ్వేజ్ వున్నట్లే దర్శకుడికి కంట్రోల్ వుండాలి. అది వివేక్ లో బాగా వుంది. నేను ఇంతకుముందు మహానటి, శ్రీదేవిసోడాసెంటర్.. ఇలా ఎన్ని పాత్రలు చేసినా అవన్నీ దర్శకుల క్రియేషన్.

 

నటుడిగా మీ నెక్ట్ లెవల్ ఎలా వుండబోతోంది?

నేను శ్రీవారికి ప్రేమలేఖ, జంబలకిడిపంబ.. ఇలా భిన్నమైన జోనర్స్ చేశాను. మధ్యలో రాజకీయాల్లోకి వెళ్ళాను. తిరిగి వచ్చాక ఎలాంటి పాత్రలు నరేశ్ చేస్తాడో అనే అనుమానం చాలా మందిలో వుంది. ఆ టైంలో దృశ్యం, చందమామకథలు చిత్రాల్లో మంచి పాత్రలు వచ్చాయి. మీరు ఏ పాత్రనైనా చేయగలరు అనే స్థాయికి వెళ్ళగలిగాను అంటే గర్వంగా వుంది.

 

సెకండ్ ఇన్నింగ్స్ లో ఇమడడానికి ఎంతకాలం పట్టింది?

నేను సెకండ్ ఇన్నింగ్స్లో రావడానికి ఎస్.వి. రంగారావును స్పూర్తిగా తీసుకున్నాను. ఆయన మెప్పించని పాత్ర లేదు. అలా నన్ను నేను సెట్ చేసుకోవడానికి పదేళ్ళు పట్టింది. తెలుగులో మంచి పాత్రలు రావడం అదృష్టంగా భావిస్తున్నాను. చిన్న సినిమాలకు రెమ్యునరేషన్ చూడకుండా మంచి పాత్ర అనిపిస్తే చేస్తున్నాను. నేను సినీ కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి నిర్మాత సాధక బాధలు తెలుసు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు