టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ మూవీ శ్రీమంతుడు అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని కొరటాల శివ తెరకెక్కించారు. అయితే ఆ మూవీ కథ తనదే అని అప్పట్లో రచయిత శరత్ చంద్ర కోర్టులో కేసు వేయడం జరిగింది. స్వాతి పత్రికలో ప్రచురించిన కథను కాపీ చేసి దర్శకుడు కొరటాల ఆ మూవీని తెరకెక్కించారని హైదరాబాద్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు రచయిత శరత్ చంద్ర.
అయితే ఆయన పిటిషన్పై విచారణ జరిపి దర్శకుడు కొరటాల శివ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది నాంపల్లి కోర్టు. కాగా నాంపల్లి కోర్టు ఉత్తర్వులపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు డైరెక్టర్ కొరటాల శివ. అనంతరం తెలంగాణ హైకోర్టు కూడా నాంపల్లి కోర్టు ఉత్తర్వులను సమర్ధించడంతో చివరికి సుప్రీంకోర్టును ఆశ్రయించారు శివ.
కొరటాల శివ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర ధర్మాసనం, తదుపరి విచారణ జరపడానికి ఏమీ లేదని స్పష్టం చేసారు. మీరు సరే అంటే పిటిషన్ డిస్మిస్ చేస్తామని లేదా వెనక్కి తీసుకుంటారా అని న్యాయవాది నిరంజన్ రెడ్డిని ప్రశ్నించింది ధర్మాసనం. తాను పిటిషన్ వెనక్కి తీసుకుంటా అని చెప్పగా అనుమతించిన ధర్మాసనం స్థానిక కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం దర్శకుడు కొరటాల క్రిమినల్ కేసు ఎదుర్కోవాల్సిందే అని స్పష్టం చేసింది.