గ్రాండ్ గా ‘రాజధాని రౌడీ’ మూవీ సక్సెస్ మీట్

‘కేజీఎఫ్, కేజీఎఫ్-2’ సినిమాల‌తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు క‌న్న‌డ స్టార్ హీరో య‌ష్‌. ఆయనకు మాస్ లో మంచి క్రేజ్ ఉంది. కాగా, ఆయ‌న న‌టించిన లేటెస్ట్ మూవీ ‘రాజ‌ధాని రౌడి’ని తెలుగులో రిలీజ్ చేశారు. ఈ సినిమాను సంతోష్ ఎంట‌ర్టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై సంతోష్ కుమార్ ప్రొడ్యూస్ చేశారు. కేవీ రాజు డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి స‌క్సెస్ గా నిలిచింది.

ఈ క్ర‌మంలో చిత్ర యూనిట్ హైదరాబాద్ లో స‌క్సెస్ మీట్ ను నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో నిర్మాత‌లు టి.ప్ర‌స‌న్న కుమార్, తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్యనారాయ‌ణ‌, నైజాం డిస్ట్రిబ్యూటర్ సంజీవి పీఆర్ఓ చందు ర‌మేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

‘రాజ‌ధాని రౌడీ’ చిత్రానికి అన్ని థియేట‌ర్స్ లో మంచి రెస్పాన్స్ ల‌భిస్తోంది. నైజాంలో ఈ చిత్రాన్ని 94 థియేట‌ర్ల‌లో రిలీజ్ చేశార‌ని.. ఈ సినిమాకు అన్ని సెంట‌ర్స్ లో మంచి వ‌సూళ్లు వ‌స్తున్నాయ‌ని చిత్ర నిర్మాత సంతోష్ కుమార్ తెలిపారు. గ‌త కొంత‌కాలంగా బీ,సీ సెంట‌ర్స్ లో సినిమాలకు స‌రైన రెస్పాన్స్ లేద‌ని.. రాజ‌ధాని రౌడీ ఆ లోటుని తీర్చింద‌ని.. ఎగ్జిబిట‌ర్స్ సంతోషంగా ఉన్నార‌ని నైజాం డిస్ట్రిబ్యూట‌ర్ సంజీవి అన్నారు.

ఈ సినిమా స‌క్సెస్ సాధించ‌డం ఎంతో సంతోషంగా ఉంద‌ని.. ధరలు అందుబాటులో ఉంటే ప్రేక్షకులు తప్పకుండా థియేటర్స్ కు వస్తారని నిర్మాత టి.ప్ర‌స‌న్న కుమార్ అన్నారు. త్వరలోనే ఏపీలో నంది అవార్డ్స్, తెలంగాణలో సీఎం రేవంత్ చెప్పినట్లు గద్దర్ అవార్డ్స్ ఇస్తారని ఆశిస్తున్నట్లుగా ఆయ‌న‌ అన్నారు.

నిర్మాత సంతోష్ ఈ సినిమాను ఒక ప్యాషన్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. నైజాం ఏరియాలో 94 థియేటర్స్ లో సినిమాను రిలీజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఈ మూవీకి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఇకపైనా ఇలాగే ప్రేక్షకుల ఆదరణ కొనసాగాలని కోరుకుంటున్నట్లు నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ అన్నారు.

Exit mobile version